Friday, November 11, 2016

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి


పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ( 1608-1693)17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త. సాక్షాత్ దైవ స్వరూపుడు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. తీర్థ యాత్రలు చేస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబలకు కాశీ పట్టణంలో జన్మించి, కర్ణాటకరాష్ట్రం, స్కందగిరి పర్వతసానువులో స్థితమైన పాపాగ్ని మఠ (ప్రస్తుతం ఇది చిక్‌బళ్లాపూర్ జిల్లా లోని కళవారహళ్లిలో ఉన్నది) అధిపతులు వీరభోజయాచార్య, వీరపాపమాంబలవద్ద పెరిగిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి, కడప జిల్లా లోని కందిమల్లాయపల్లిలో చాలాకాలం నివసించి సజీవ సమాధి నిష్ఠనొందాడు. వీరబ్రహ్మము వలన ప్రసిధ్ది పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలములో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగిన ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటివరకు జరిగాయి. జరుగు తున్నాయి
బ్రహ్మం గారు సాక్షాత్ దైవ స్వరూపుడు. రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానంలో సుస్పష్టంగా వివరించి, జనులందరిని సన్మార్గంలో నడువమని బోధించిన మహిమాన్వితుడు చరిత్రకారుల కాలజ్ఞాన పరిశోధన ఫలితంగా, బ్రహ్మం గారు చిన్నతనములోనే తల్లిదండ్రులను కోల్పోయి అత్రి మహాముని ఆశ్రమంలో చేరుకున్నారు. కర్ణాటక లోని పాపాఘ్ని మఠాధిపతి యనమదల వీరభోజయచార్యులు, సతీ సమేతంగా సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకుంటాడు. సంతాన ప్రాప్తి కై పరితపిస్తున్న ఆ పుణ్య దంపతుల చెంతకు, దైవ స్వరూపులు అయిన బ్రహ్మం గారిని అత్రి మహాముని అందజేస్తాడు. వీరభోజయాచార్య, ఈ బాలుడు, మహిమాన్వితుడు, మునుముందు, ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు అంటూ ఆ బాలుని వీరభోజయాచార్య దంపతులకు అందజేస్తాడు.ఆ విధంగా బ్రహ్మం గారు పాపాఘ్ని మఠాధిపతి గారింట సనాతన సంప్రదాయాల నడుమ పెరుగుతూ వస్తాడు. (ఈనాడు కర్ణాటక లోని పాపాఘ్ని మఠం బ్రహ్మం గారి ప్రథమ మఠంగా పేరు గాంచి దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్నది). అతి చిన్న వయసులోనే, బ్రహ్మం గారు కాళికాంబ పై సప్తశతి రచించి అందరిని అబ్బురపరుస్తాడు. బ్రహ్మం గారి పదవ ఏట వీరభోజయచార్యులు స్వర్గాస్తులవుతారు. అటు పిమ్మట దేశాటన నిమిత్తమై బయలుదేరబోతు తన తల్లి ఆశీర్వాదాలు కోరతాడు. అందుకు, వారి తల్లి, నాయన, వీరంభోట్లయ్య (బ్రహ్మం గారు చిన్న నాడు వీరంభోట్లయ్యగా పిలువబడ్డారు, పాపాఘ్ని ప్రస్తుత మఠాధిపతుల వద్ద దీనికి సంబంధించి శాసనాలు ఉన్నాయి), మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలి పెట్టి దేశాటనకు బయల్దేరితే ఎలాగంటూ శోక సంద్రంలో మునిగి పోతుంది. అప్పుడు బ్రహ్మం గారు, తన తల్లి గారికి సృష్టి క్రమాన్ని వివరించాడు. స్త్రీ పురుషుల సంభోగం పవిత్ర కార్యమని, శుక్రశోణితంతో స్త్రీ గర్భ ధారణ గావించాక, గర్భం ధరించిన ప్రతి నెలలో, కడుపులో శిశువు ప్రాణం పోసే విధానాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తారు బ్రహ్మం గారు. ఆగామి, ప్రారబ్ధ, సంచిత కర్మ సిద్ధాంతము గురించి వివరించి ఆమెకు మాయ తెరను తొలగించి, లోక కళ్యాణ నిమిత్తమై దేశాటనకు బయల్దేరతారు బ్రహ్మం గారు.
కర్నూలు జిల్లాలొని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోపాలకుడిగా ఉంటు, రవ్వలకొండలో కాలజ్ఞానం వ్రాశారు. ఆవుల చుట్టూ గిరి గీసి రవ్వల కొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మం గారు. ఒకరోజు మిగతా గోపాలకులు ఈ విషయాలన్నీ చూచి భయపడి పరుగు పరుగున, అచ్చమ్మ గారికి ఈ విషయాన్ని చేరవేస్తారు. మరుసటి రోజున యథావిధిగా ఆవులను తీసుకుని వెళ్లి చుట్టూ గిరి గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావిస్తూ ఉన్న బ్రహ్మం గారిని చూసి ఆశ్చర్య పోతుంది అచ్చమ్మ. (అచ్చమ్మ బ్రహ్మం గారిని దర్శించుకున్న రవ్వలకొండలో ఈనాడు సుందరమైన బ్రహ్మం గారి దేవాలయం ఉన్నది). బ్రహ్మం గారి మహిమ తెలుసుకున్న అచ్చమ్మ, ప్రుట్టు గుడ్డి వాడైన తన కొడుకు బ్రహ్మానంద రెడ్డికి చూపు ప్రసాదించమని ప్రార్థిస్తుంది. బ్రహ్మం గారు తన దివ్య దృష్టితో, బ్రహ్మానంద రెడ్డి గత జన్మ పాపాలను దర్శించి, అతనికి చూపు ప్రసాదించి, పాప నివృత్తి గావించారు. గుహలో కూర్చుని వ్రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికీ భద్రంగా ఉన్నాయి. కాలజ్ఞానం వ్రాసిన తర్వాత బ్రహ్మంగారు కందిమల్లాయపల్లె చేరి వడ్రంగి వృత్తిచేస్తూ గడిపాడు. తనవద్దకు వచ్చినవారికి వేదాంతం వినిపిస్తూ కులమతాలకు అతీతంగా అంతా సమసమాజం బాటన నడవాలని బోధించాడు.
జననo
బ్రహ్మంగారి పూర్తి పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన తండ్రి పోతులూరి పరిపూర్ణయాచార్యులు మరియు తల్లి పోతులూరి ప్రకృతాంబలకు, క్రీస్తు శకం 1608 లో జన్మించాడు . ఆయనను పెంచిన తండ్రి పేరు వీర భోజయాచార్యులు మరియు పెంచిన తల్లి పేరు వీరపాపమాంబ. ఆయనకు చిన్న వయస్సులోనే విశేష జ్ఞానం లభించింది. ఎక్కువ ఆత్మచింతన మితభాషణం అలవడింది. ఆయన వీర భోజయాచార్యులు మరణానంతరం స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలని నిశ్చయించి తన ఎనిమిదవ ఏట దేశాటన కొరకు తల్లి అనుమతి కోరాడు. పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానబోధ చేశాడు. ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి, జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని, వాటిని వదలమని తల్లికి హితవు చెప్పి ఆమె అనుమతి సంపాదించి దేశాటనకు బయలుదేరాడు.
తల్లికి చేసిన జ్ఞానబోధ
బ్రహ్మంగారికి ఆదిశంకరులు వలె దేశాటన ద్వారా జ్ఞాన సంపాదన చేసి, దానిని ప్రజల వద్దకు చేర్చడం అంటే మక్కువ ఎక్కువ. ఆయన తన మొదటి జ్ఞానబోధ తల్లితో ప్రారంభించాడు. శరీరం పాంచభౌతికమని ఆకాశం, గాలి, అగ్ని, పృధ్వి, నీరు అనే అయిదు అంశాలతో చేయబడిందని సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము అనే జ్ఞానేంద్రియాలద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని, వీటి ద్వారా 'నేను' అనే అహం జనిస్తుందని, ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవుని నడిపిస్తుందనీ, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దానిని తప్పించడం ఎవరికీ సాధ్యపడదనీ, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె వద్ద సెలవు తీసుకుని దేశాటనకు బయలుదేరాడు.
అచ్చమాంబకు జ్ఞానబోధ
బ్రహ్మంగారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చూసేందుకై తిరుగుతూ బనగానపల్లెకు వచ్చి పగలంతా తిరిగి రాత్రికి ఒక ఇంటి అరుగు మీద విశ్రమించి అక్కడే నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారిన తరువాత ఇంటి యజమానురాలైన అచ్చమ్మ ఆయనను ప్రశ్నించి, ఆయన ఏ దైనా పని కోసం వచ్చానని చెప్పటంతో, ఆమె ఆయనకు పశువులను కాచే పనిని అప్పగించింది. పశువులను కాచే నిమిత్తం రవ్వలకొండ చేరిన ఆయన అక్కడి ప్రశాంత వాతావరణంచే ఆకర్షించబడి అక్కడే ఉన్న ఒక గుహను నివాసయోగ్యం చేసుకుని కాలజ్ఞానం వ్రాయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో ఆయన గోవులకు ఒక వలయం ఏర్పరిచి, దానిని దాట వద్దని ఆజ్ఞాపించడంతో అవి ఆ వలయం దాటకుండా మేత మేస్తూ వచ్చాయి. ఒక రోజు ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమాంబ ఆయన ఏకాగ్రతగా వ్రాయడం, పశువుల ప్రవర్తన గమనించి, ఆయన ఒక జ్ఞాని అని గ్రహించింది. అచ్చమ్మ ఇన్ని రోజులు ఇది గ్రహించకుండా ఆయన చేత సేవలు చేయించుకున్నందుకు మన్నించమని వేడగా ఆయన నాకు దూషణ భూషణలు ఒకటేనని నీవు అయినా తల్లి అయినా తనకు ఒకటేనని ప్రంపంచంలోని జీవులన్నీ తనకు ఒకటే" నని చెప్పాడు. ఆ తరువాత అచ్చమ్మ తనకు జ్ఞానబోధ చేయమని కోరగా, ఆమెకు యాగంటిలో జ్ఞానబోధ చేసాడు. ఆయన అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తారు.
ఆ సందర్భంలో అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు అడిగింది.
అచ్చమ్మ:- పరమాత్మ ఎక్కడ ఉన్నాడు?
బ్రహ్మంగారు:- పరమాత్మ నీలో నాలో ఈ పశువులలో అన్నిటా ఆయన ఉనికి ఉంటుంది.
అచ్చమ్మ:- ఆయనను ఎలా తెలుసుకోగలం?
బ్రహ్మంగారు:- అనేక మార్గాలున్నప్పటికీ భక్తి, ధ్యాన మార్గాలు శ్రేష్టమైనవి. భక్తి మార్గం అంటే పరమాత్మను తలచుకుంటూ గడపడం. ధ్యానమార్గంలో ప్రాణాయామం లాంటి వాటి ద్వారా పరమాత్మ గురించి తెలుసుకోవడం.
అచ్చమ్మ:- ఆయన స్త్రీయా పురుషుడా?
బ్రహ్మంగారు:- ఆయన నిరాకారుడు, నిర్గుణుడు వర్ణనకు అతీతుడు. ఇలా చెప్పి వీటిని ఏకాగ్రతతో ధ్యానించమని చెప్పి తరువాత కాలజ్ఞానం గురించి చెప్పాడు.
బనగానపల్లె నవాబుకు జ్ఞానబోధ
బనగానపల్లె నవాబు బ్రహ్మంగారి గురించి విని ఆయన నిజంగా మహిమాన్వితుడో కాదోనని స్వయంగా తెలుసుకోవాలని ఆయనను తన వద్దకు పిలిపించాడు. ఆయన రాగానే స్వయంగా స్వాగతంచెప్పి, ఆయనను ఆసీనులను చేసాడు. స్వామివారికి ఫలహారాలు తీసుకురమ్మని సేవకుని ఆజ్ఞాపించాడు. అయినా ఆయనకు మాంసాహారం తీసుకురమ్మని సేవకునికి ముందుగానే సూచన చేసాడు. నవాబు ఆదేశానుసారం సేవకుడు మాంసాహారం నింపిన పళ్ళెరాన్ని బ్రహ్మంగారి ముందు ఉంచాడు. ఆయన పళ్ళెరం పైనున్న వస్త్రాన్ని తొలగిస్తే ఫలహారం స్వీకరిస్తానని చెప్పగా, సేవకుడు అలాగే చేసాడు. ఆపళ్ళెంలోని మాంసాహారం పుష్పాలుగా మారటం అక్కడి వారిని ఆశ్చర్యచకితులను చేసింది. ఈ సంఘటనతో నవాబుకు ఆయన మహిమలపై విశ్వాసంకుదిరి, ఆయనను పలువిధాల ప్రశంసించాడు. ఆ సందర్భంలో బ్రహ్మంగారు నవాబు సమక్షంలో కొన్ని కాలజ్ఞాన విశేషాలు చెప్పాడు. ఆ తరువాత నవాబు ఆయనకు డెబ్బై ఎకరాల భూమిని దానంచేసి, దానిని మఠం నిర్వహణకు ఉపయోగించవలసినదిగా కోరి, ఉచిత మర్యాదలతో సత్కరించి సాగనంపాడు.
విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది. అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి, ఆ చెట్టు నశిస్తుంది. అది మొదలు దేశంలో తీవ్రమైన కరువుకాటకాలు ఏర్పడతాయి.ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆ ధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు. జనులు అరచి అరచి చస్తారు.కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు. ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవుకూడా మిగలదు.బనగాన పల్లె నవాబు పాలనకూడా క్రమంగా నాశనమౌతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది.
దేశాటన
ఆపై ఆయనకు దేశాటన చేయాలని కోరిక కలగటంతో శిష్యులకు నచ్చచెప్పి దేశాటనకు బయలుదేరాడు. ఆసమయంలో కడప జిల్లాలో పర్యటిస్తూ కందిమల్లయ పాలెం చేరుకున్నాడు. ఆ ఊరు ఆయనను ఆకర్షించడంతో అక్కడ నివాసం ఏర్పరుచుకుని మామూలు వడ్రంగిలా జీవించడం ప్రారంభించారు. గ్రామంలో అమ్మవారి జాతర కొరకు చందా ఇవ్వమని పెద్దలు ఆయనను కోరగా తాను పేదవాడినని ఏమీ ఇవ్వలేనని బదులిచ్చాడు.వారు ఆయనను చులకనచేసి మాట్లాడగా ఆయన తాను ఏదైనా ఇస్తానని కానీ అమ్మవారి గుడిదగ్గర ప్రజల సమక్షంలో మాత్రమే తీసుకోవాలని కోరాడు. వారు అందుకు సమ్మతించి అమ్మవారి గుడి దగ్గరకు అందరూ చేరారు.అందరి ముందు గుడి ముందు నిలబడి ఒక చుట్ట చేత పట్టుకుని అమ్మవారిని ఉద్దేశించి 'పోలేరీ చుట్టకు నిప్పు పట్టుకునిరా ' అని కోరగానే అదృశ్యరూపంలో అమ్మవారు ఆయనకు నిప్పు అందించగా ఊరివారు దిగ్భ్రాంతి చెంది ఆయనను గౌరవించడం మొదలుపెట్టారు.ఆయన వారికి ధర్మబోధ చేయడం మొదలు పెట్టారు.ఇలా ఆయన గురించి చుట్టూ ఉండే ప్రదేశాలకు తెలిసి రావడంతో వారు ఆయనకోసం తరలి రావడం మొదలుపెట్టారు.
కొంతకాలం తరువాత బ్రహ్మంగారి కందిమల్లయపాలెం విడిచి తిరిగి దేశాటన సాగించాడు.అలా పెద కామెర్ల అనే ఊరు చేరుకుని అక్కడ నివసించసాగారు. ఆయన అక్కడ సామాన్య జీవితం ప్రారంభించారు.ఆ ఊరిలో ఒక భూస్వామి వ్యాధి బారినపడి మరణించగా ఆయనను శ్మశానానికి తీసుకు వెళుతున్న సమయంలో బ్రహ్మంగారు తన ఇంటి ముంగిట నుండి చూసి 'ఏమైందని' అని అడిగాడు.వారు 'అతడు మరణించాడు శ్మశానానికి తీసుకు వెళుతున్నాం ' అని బదులు చెప్పారు.కానీ బ్రహ్మంగారు 'ఇతడు మరణింలేదుకదా ఎందుకు తీసుకు వెళ్ళడం ఇతనిని దింపుడు కళ్ళెం వద్ద దించండి' అని చెప్పి వారి వెంట వెళ్ళాడు.వారు ఆయనపై అవిశ్వాసంతోనే దింపుడు కళ్ళం వద్ద దింపారు.అప్పుడు బ్రహ్మంగారు భూస్వామి శరీరాన్ని తల నుండి పాదం వరకు చేతితో స్పృసించగానే ఆయన జీవించాడు.అది చూసిన వారంతా ఆయనపట్ల భక్తి ప్రదర్శించడం మొదలు పెట్టారు.
బ్రహ్మంగారు చేసిన మహిమలను విశ్వసించని కొందరు ఆయనను ఎగతాళి చేసే ఉద్దేశంతో సజీవంగా ఉన్న వ్యక్తిని పాడె మీద తీసుకు వచ్చి 'ఇతనికి ప్రాణం పోయండి 'అని వేడుకున్నారు.బ్రహ్మంగారు ధ్యానంలో నిజం తెలుసుకుని 'మరణించిన వ్యక్తికి ఎలా ప్రాణం పోయగలను' అని బదులిచ్చాడు. వెంటనే పాడె మీదున్న వ్యక్తి మరణించడం అందరిని ఆశ్చర్యచకితులను చేసింది.వారు బ్రహ్మంగారిని మన్నించమని వేడగా ఆయనవారికి బుద్ధిమతి చెప్పి మరణించిన వ్యక్తి తలని చేతితో స్పృజించి ఆతనిని సజీవుని చేశారు.ఆతరువాత అక్కడి ప్రజలు ఆయనను దేవుడిలా కొలవసాగారు. ఊరి ప్రజల కోరికపై ఆయన వారికి జ్ఞానబోధ చేయడం ప్రారంభించారు.
వివాహం
బ్రహ్మంగారి బోధలు విని పెదకొమర్లపల్లెలోని ప్రజలు ఆయన అనుచరులుగా మారారు.ఆ ఊరిలోని శివకోటాయ్య చార్యులనే విశ్వబ్రాహ్మణుడు ప్రారంభంలో బ్రహ్మంగారిని నమ్మకపోయినా తరువాత నమ్మకం ఏర్పడి తనకుమార్తెను ఆయనకు ఇచ్చి వివాహం చేస్తానని కోరాడు.అందుకు బ్రహ్మంగారు అంగీకారం తెలపాడు.వివాహానంతరం కొంతకాలం ఆయన భార్యతో జీవిస్తూ శిష్యులకు జ్ఞానబోధ చేసాడు.
కొంత కాలం తరువాత ఆయన తిరిగి దేశాటనకు బయలుదేరాడు.ఆయన ముందుగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించి రాజమండ్రి వరంగల్ లో పర్యటించి హైదరాబాదు చేరాడు.
హైదరాబాదు పర్యట
హైదరాబాదు నవాబు బ్రహ్మంగారిని గురించి తెలుసుకొని ఆయన కొరకు కబురు పంపగా బ్రహ్మంగారు నవాబు వద్దకు వెళ్ళాడు.మొందుగా నవాబు ఆయనతో 'మీరు జ్ఞాని అయినా దైవాంశసంభూతుడుగా నమ్మలేనని ఏదైనా మహిమ చూపితే విశ్వసించగలనని 'అని పలికాడు.బ్రహ్మంగారు వెంటనే ఒక గిన్నెలో నీళ్ళు తెప్పించమని కోరాడు.సేవకుడు తీసుకువచ్చిన నీటితో దీపం వెలిగించాడు.అది చూసిన నవాబు విశ్వాసం కుదిరిందని జ్ఞానబోధ చేయమని కోరాడు.నవాబు కోరికపై బ్రహ్మంగారు జ్ఞానబోధ చేసాడు.
సిద్దయ్య
బ్రహ్మంగారు వైదిక మతావలంబీకులైనా కులమతాలకు అతీతంగా వ్యవహరించాడు.స్త్రీల పట్ల ఆదరణను ప్రదర్శిస్తూ తన భావాలను వెలిబుచ్చాడు.అలాగే దూదేకుల కులానికి చెందిన సైదులను తనశిష్యునిగా చేసుకున్నాడు.ఆయన ఉన్నత భావాలను భక్తి శ్రద్ధలను మెచ్చుకుని తన ప్రీయశిష్యుని చేసుకుని ఆయనకు అనేక ఉన్నత భోదలు చేసాడు.ఆయన జ్ఞానంలభించినవాడని ప్రశంశించి జ్ఞానంసిద్దించింది కనుక సిద్దయ్యగా నామకరణం చేసాడు."సిద్ధా" అనే మకుటంతో కొన్ని పద్యాలను అసువుగా చెప్పాడు.
బ్రహ్మంగారి శిష్యులకు సిద్ధయ్యపై కించిత్తు అసూయ ఉండటం గ్రహించి దానిని పోగొట్టి సిద్దయ్య గురుభక్తిని చాటటానికి ఒక సారి తన శిష్యులందరిని పిలిచి చనిపోయి కుళ్ళి దుర్గంధ భరితమైన కుక్క మాంసాన్ని తినమని శిష్యులందరికి ఆదేశించాడు మిగిలిన శిష్యులందరూ దానికి నిరాకరించగా సిద్దయ్య మాత్రం భక్తిగా దానిని భుజించాడు.ఆ తరువాత బ్రహ్మంగారు మిగిలిన శిష్యులకు సిద్ధయ్య భక్తి ఎలాంటిదో వివరించాడు.అనేక విశిష్ట జ్ఞానబోధలు సిద్దయ్యకు ప్రత్యేకంగా చేసాడు.
తిరుగు ప్రయాణo
బ్రహ్మంగారు హైదరాబాదులో కొంతకాలం ఉండి తిరుగు ప్రయాణానికి ఆయత్తమయ్యారు.శిష్యబృదంతో రోజంతా ప్రయాణించి అలసిపోయి ఒక ప్రదేశంలో విశ్రమించారు.ఆయన తన శిష్యుడైన వెంకటయ్యనుద్దేశించి 'కొంత సమయంలో ఒక అద్భుతం జరగబోతుంది' అని యథాప్రకారం సంభాషించసాగారు. అక్కడికి కొంత దూరంలో ఏవోమాటలు వినిపించగా అది ఏమిటో తెలుసుకొని వద్దాం రమ్మని శిష్యులతో అక్కడికి వెళ్ళగా అక్కడ ఒక బ్రాహ్మణ స్త్రీ కుష్టువ్యాధిగ్రస్తుడైన భర్త శరీరాన్ని ఒడిలో పెట్టుకొని రోదిస్తూ కనపడింది. బ్రహ్మంగారు ఆమెనడిగి వ్యాధి వివరాలు కనుక్కొని ఆ స్త్రీకి ఊరట కలిగిస్తూ 'మీ గత జన్మ పాపం వలన ఇది సంక్రమించింది నేను మీకు పాపవిముక్తి చేస్తానని చెప్పి బ్రాహ్మణ యువకుని చేతితో తడిమాడు.వెంటనే అతనికి వ్యాధి మాయం అయింది. వారు ఆయనను కొనియాడి తమ ఊరికి వచ్చి జ్ఞాన బోధ చేయమని కోరగా ఆయన తగిన సమయం వచ్చినప్పుడు వస్తానని వారిని పంపి వేసాడు.
బ్రహ్మంగారిపై ఆరోపణ
ఒకరోజు బ్రహ్మంగారికి కడపనవాబు నుండి ఒక లేఖ వచ్చింది. అందులో పీరు సాహెబ్ తన కుమారుడైన సిద్దయ్యను బ్రహ్మంగారు ప్రలోభపెట్టి హిందుగా మార్చాడని ఆరోపణ చేసినందువలన విచారణ నిమిత్తం బ్రహ్మంగారిని రమ్మని నవాబు పంపిన ఆదేశం ఉంది. బ్రహ్మంగారు ఒంటరిగా నవాబును కలుసుకునేందుకు బయలు దేరగా సిద్దయ్య ఇది తనకు సంబంధించిన విషయంకనుక తాను వెళతానని చెప్పి తాను సేవకులతో బయలుదేరాడు.
మార్గమధ్యంలో సేవకులకు తెలియకుండా బయలుదేరి ముందుగా కడప చేరుకుని ఊరి బయట బసచేసాడు.అక్కడ ఆయన ధ్యానంచేస్తూ తనదగ్గరకు అధికంగా వచ్చే మహమ్మదీయ భక్తులకు జ్ఞానబోధచేస్తూ వారి వేషధారణ మార్చి కాషాయ దుస్తులు రుద్రాక్షలు తిలకథారణ చేయిస్తూ వచ్చాడు.ఇది తెలుసుకున్న నవాబు కుపితుడై సిద్దయ్యను తన వద్దకు రమ్మని ఆదేశం పంపాడు.ఆదేశంపై వచ్చిన సిద్దయ్య నిర్భయత్వానికి నవాబు ఆగ్రహించి 'మహమ్మదీయుడివై హిందువుని ఆశ్రయించి నీ మతన్ని అవమానించావు కనుక నీవు శిక్షార్హుడువి ఇందుకు నీ జవాబేమిటి 'అని గద్దించాడు.జవాబుగా సిద్దయ్య చిరునవ్వు నవ్వగా అది చూసి నవాబు మరింత ఆగ్రహించి 'నీకు మహిమలు తెలుసుకదా అవి చూపు లేకుంటే కఠిన శిక్ష వేస్తాను 'అన్నాడు.జవాబుగా సిద్దయ్య 'గురువుగారి ఆజ్ఞ లేనిదే మహిమ చూపకూడదు కాని తప్పని సరి పరిస్థితిలో గురువుగారి మహిమ చూపటానికి ఒకటి ప్రదర్శిస్తాను. మీరు పెద్ద బండ రాయిని తెప్పించండి' అన్నాడు.సిద్దయ్య అక్కడి వారికి ఆపద కలగకూడదని ఖాళీ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆబండను పెట్టించి గురువుగారిని తలచుకుని సలాం చేశాడు.వెంటనే ఆబండ ముక్కలైంది.నవాబు తన తప్పు తెలుసుకొని జ్ఞానబోధ చేయమని కోరగా సిద్దయ్య అది తనపని కాదని తన గురువుగారు తగిన సమయం వచ్చినప్పుడు చేస్తారని చెప్పి తిరిగి వెళ్ళాడు.
బ్రహ్మంగారు తనశిష్యుడు సిద్దయ్యకు యోగవిద్య కుందలినీశక్తి శరీరంలోని యోగచక్రాలు గురించి వివరిస్తూ శరీరం ఒకదేవాలయమని అందులో దేవతలుంటారని కుండలినీ శక్తిని జాగృతం చేయడం ద్వారా వారిని దర్శించవచ్చని వివరిస్తుండగా కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా విన్నాడు.కక్కయ్య శరీరంలోని అద్భుతాలు చూడాలన్న ఆతురతతో ఇంటికి వెళ్ళాడు.ఇంట్లో అతని భార్య నింద్రించడం చూడగానే ఆమె శరీరంలో దేవతలను చూడాలని ఆమెను ముక్కలుగా నరికి వేశాడు.అయినా ఆమెశరీరంలో రక్తమాంసాలు తప్పఏమీ కనిపించకపోవడంతో తనను బ్రహ్మంగారి మాటలు మోసపుచ్చాయని విలపించాడు.ఆయన మాటలు నమ్మి భార్యను నరికివేసానని బ్రహ్మంగారు దీనికంతా కారణమని ఆయన దొంగ అని అందరికీ చెప్పాలని అనుకున్నాడు. ముందుగా ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనను అడగాలనుకుని బ్రహ్మంగారి దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పి ఆయనను దూషించడం మొదలుపెట్టాడు. బ్రహ్మంగారు కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపడి వెంటనే 'కక్కా నేను చెప్పింది అసత్యం కాదు నేను అసత్యం పలకను నిదర్శనంగా నీ భార్యను బ్రతికిస్తాను ' అనిచెప్పి అతని వెంట అతని ఇంటికి వెళ్ళి అతనిభార్య శరీరంపై మంత్రజలం చల్లగానే ఆమె నిద్ర నుంచి మేల్కొన్నట్లు లేచి కూర్చుంది.కక్కయ్య బ్రహ్మంగారి మహిమ తెలుసుకుని ఆయనను మన్నించమని పలు విధాల వేడుకుని తనను శిష్యుడిగా చేర్చుకొనమని తాను వెంట నడుస్తానని బ్రహ్మంగారిని వేడుకున్నాడు.బ్రహ్మంగారు ఎవరూ 'నన్ను పూజించవద్దు నాశిష్యులెవరూ నన్ను పూజించరు దేవుడిని అన్వేషిస్తారు అదే అందరికి ఆమోదయోగ్యము నువ్వు కూడా అదే పని చెయ్యి ' అని చెప్పి తిరిగి వెళ్ళాడు.
విశ్వబ్రాహ్మణులకు తత్వోపదేశo
బ్రహ్మంగారు యధావిధిగా దేశాటనకు బయలుదేరి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ నంద్యాల సమీపంలోని ఒకగ్రామంలో భోజనార్ధం విశ్రాంతి తీసుకుంటూ దాహం కోసం ఒక విశ్వబ్రాహ్మణుని ఇంటి ముంగిట నిలబడి మంచి నీళ్ళు ఇమ్మని అడిగాడు.అతను పనిమీద నిమగ్నమై నీళ్ళు ఇవ్వడం కుదరదని ప్రక్కనే ఉన్న బావిలో చేదుకుని త్రాగమని చెప్పాడు.బ్రహ్మంగారు వినకుండా నీళ్ళు కావాలని తిరిగి అడిగాడు.విశ్వబ్రాహ్మణుడు ఆగ్రహించి కరుగుతున్న లోహం తీసుకువచ్చి త్రాగమని అన్నాడు.బ్రహ్మంగారు మారు పలుకక ఆలోహ ద్రవాన్ని త్రాగి వేసాడు.అది చూసిన విశ్వబ్రాహ్మణుడు భయపడి తాను అపరాధంచేశానని క్షమించమని వేడుకున్నాడు.అందుకు బ్రహ్మంగారు "నాకు అజ్ఞానం మీద తప్ప ఎవరిమీద కోపం లేదు" అని చెప్పాడు.ఆతరువాత ఆ విశ్వబ్రాహ్మణుని కోరికపై ఆతిధ్యం స్వీకరించి బయలుదేరి కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని నంద్యాల చేరుకున్నాడు.నంద్యాలలోని ప్రజలు బ్రహ్మంగారికి బోజనవసతులు కల్పించి ధర్మ బోధవిని ఆనందించారు.నంద్యాలలో విశ్వబ్రాహ్మణులనుపంచాననం అనేవారు.బ్రహ్మంగారు వారి వద్దకు వెళ్ళి తమకు ఆహారాన్నిచ్చి క్షుద్భాధ తీర్చమని అడిగాడు.వారు ఆయనను ఎంత అన్నం అవసరమౌతుందని పరిహసించారు.బదులుగా బ్రహ్మంగారు "మాకు ఎంత అవసరములే మాకడుపు నిండినంత చాలు" అన్నారు.వారు బ్రహ్మంగారిని అవమానించాలని "అలాకాదు మీరు తక్కువ తింటే ఎలా ఒకపుట్టి బియ్యం వండి వడ్డిస్తాం మీరు అంతా తిని మమ్ములను సంతృప్తి పరచండి" అన్నారు.అందుకు బ్రహ్మంగారు సమ్మతించగా వారు పుట్టెడు బియ్యం వండించి భుజించమని చెప్పారు.అందుకు బ్రహ్మంగారు ఈ పనికి తాను అవసరంలేదని తనశిష్యుడు సిద్దయ్య చాలని అన్నాడు.బ్రహ్మంగారు ఒక్క ముద్ద అన్నం తీసుకుని మిగిలినదానిని తినమని సిద్దయ్యను ఆజ్ఞాపించాడు.సిద్దయ్య అలాగే ఆన్నమంతా తిని ఇంకా కావాలని సైగ చేసాడు.ఇది చూసిన విశ్వబ్రాహ్మణులు నిర్గాంతపోయి తమని క్షమించమని బ్రహ్మంగారిని వేడుకున్నారు.ఆయన చిరునవ్వుతో తనచేతిలోని అన్నాన్ని సిద్దయ్యకు అందించగా అది ఆరగించిన తరువాత అతని ఆకలి తీరింది.విశ్వబ్రాహ్మలు బ్రహ్మంగారికి పూజలు చేసి తత్వబోధ చేయమని కోరారు.ఆయన వారికి జ్ఞానబోధ చేసి అక్కడి నుండి బయలుదేరి అహోబిలం చేరారు.
సమాధి తర్వాత దర్శనం
సిద్దయ్యను పూలు తీసుకురమ్మని బనగాన పల్లెకు పంపి బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్ళాడు. సిద్ధయ్య తిరిగి వచ్చి గురువు కోసం విపరీతంగా విలపించ సాగాడు.బ్రహ్మంగారు శిష్యునిపై కరుణించి సమాధిపై రాతిని తొలగించమని ఆదేశించి రాతిని తొలగించిన తరువాత బయటికి వచ్చి సిద్ధయ్యను ఓదార్చాడు. ఆ పై సిద్దయ్య కోరికపై పరిపూర్ణంను బోధించాడు. ఆ తరువాత సిద్ధయ్యకు దండం, కమండలం, పాదుకలు మరియు ముద్రికను ఇచ్చి తిరిగి సమాధిలో ప్రవేశించాడు.
బనగనుపల్లె చింతచెట్టు
బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి ఆవరణలో బ్రహ్మంగారు ఆయనచే వ్రాయబడిన 14,0000 కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై ఒక చింత చెట్టు నాటి ఉంచాడు. ఆ గ్రామంలో ఏవైనా ప్రమాదాలు, ఆపదలు కలిగే ముందు సూచనగా ఆ చింతచెట్టు పూలు అన్నీ రాలిపడతాయని అక్కడి ప్రజల విశ్వాసం. ఆచెట్టు పంగలలో ఎర్రటి రక్తంలా ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆరినప్పుడు కుంకంలా ఉంటుంది. వ్యాధులు మరియు ప్రమాదాలు నివారణ కొరకు దానిని స్వీకరిస్తుంటారు. ఆ చెట్టు అక్కడి ప్రజలందరికీ సుపరిచితమే. ఆ చింతచెట్టుకు నిత్యదీపారాధన చేస్తూ ఉంటారు. ఆ చింత చెట్టు కాయలు లోపల నల్లగా తినడానికి పనికిరానివై ఉంటాయి.
బ్రహ్మంగారి మఠం
బ్రహ్మంగారి మఠం ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. కర్ణాటక, తమిళనాడు లతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆధ్యాత్మిక కేంద్రం కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గంలో భాగంగా ఉంది. ప్రస్తుతం బి.మఠం మండల కేంద్రం కూడా.
బ్రహ్మం గారు కులాలను రూపుమాపి సమసమాజ నిర్మాణానికి కృషి చేశారు. ఈయన శిష్యులలో ముఖ్యుడైన దూదేకుల సిద్దయ్య దూదేకుల కులానికి, మరొక భక్తుడుమాదిగకక్కయ్య పంచముడు అవడమే ఇందుకు తార్కాణము. ఈ చర్యలను నిరసించిన స్థానికులు బ్రహ్మంగారిని వెలివేశారు. నిప్పు, నీరూ ఇవ్వలేదు. నీటి అవసరాలు తీర్చుకోవడానికి రాత్రికి రాత్రే తన నివాసములో జింక కొమ్ముతో బావిని త్రవ్వుకున్నారు.
వారసులు
బ్రహ్మంగారి కుమార్తె వీరనారాయణమ్మ సంతతికి చెందిన (ఏడవ తరం) వీరభోగ వసంత వేంకటేశ్వర స్వామి ప్రస్తుత 11వ మఠాధిపతి. ఈయన బ్రహ్మంగారి సాహిత్యం, సారస్వతాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. మఠంలో నిత్యాన్నదానం జరుగుతుంది. బ్రహ్మంగారి పేరుతో పలు విద్యాసంస్థలు వెలిశాయి. ఇంజినీరింగ్ కళాశాల, జూనియర్ కళాశాల, వేద పాఠశాల (తమిళనాడు భక్తుడు పట్నాల సన్యాసి రావు గారి ఏర్పాటు) నడుస్తున్నాయి.
కాలజ్ఞానం పద్యాలు
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానము (ముక్తి మార్గము భక్తి మార్గము పుస్తకములో) నుండి కొన్ని పద్యాలు)
వీరబ్రహ్మము యెక్క వేద వాక్యంబులు
ధరణిలో తప్పక జరిగేనయా
కలిమాయలో పడక నన్ను నమ్మియు మీరు
కడతేరు మార్గంబు వెతకండయా!
వచ్చింది తెలియదు పోయేది తెలియదు
మధ్యలో మనబ్రతుకు ఏమౌనో తెలియదు
ఏమి తెలియని జన్మ కెందుకుర గర్వంబు
అందరిని కాపాడు ఆధి పురుషుని నమ్ము!
నాది నాది యనుచు గర్వించి చెప్పేరు
తల్లి గర్భము నుండి ఏమి తెచ్చారు
ఆరు అడుగుల నేల అందరిని పూడ్చుటకు,
అదియును మీదని ఎవరు చెప్పారు?
సముద్రాలు పొంగేట్టు గాలులే కదిలేట్టు
చేసే మహా శక్తి మనిషిలోను ఉంది
నీలోని శక్తిని భక్తితో ధ్యానింప
ఆదైవ దర్శనము కలిగేనయా!
దైవ స్వరూపుడవు నీవేనురా
కోర్కెలతో మనిషివై పోయావురా
కొరగాని కోర్కెలను కట్టి పెట్టిన నీవు
కోదండ రాముడై వెలిసేవురా!
స్వయముగా వెలిగేటి శక్తి దేనికి లేదు
సర్వేశ్వరుని తప్ప తెలియండయా
సూర్యచంద్రాదులు, సర్వగ్రహంబులు
ఆ వెలుగుతో వెలుగుచున్నారయా!
అనంత విశ్వములో ఈ గోళమెంతరా?
ఇందులో వున్నట్టి నీశక్తి యెంతరా?
సర్వమును కాపాడు సర్వ శక్తిని నీవు,
శరణు బొందుటే నీదు ధర్మంబురా!
వల్లకాటికి పోవు ఒళ్ళు వస్త్రాలను
బహు శుచిగ కాపాడుకొనియేరయ!
తమవెంట వచ్చేది మనస్సు బుద్దనుమాట
యోచింపకుండనే బ్రతికేరయ!
దానంబు చేయకే దరిద్రులయ్యేరు
దైవమును నిందింప ఫలమేమయ
పదుగురికి ధర్మంబు చేసిన పుణ్యమే
జన్మ జన్మకు వెంట వచ్చేనయా!
బాహ్యా విషయములకై పరుగెత్తినావంటె
యేడ్పించి నీపై స్వారి జేసేను
పరమాత్మ వైపున మనస్సు నిలిపావంటె
ప్రకృతే నీపాద సేవ జేసేను!
దైవ ధ్యానము కన్న మించినది లేదయ
అనంత శక్తులు అందులో ఉన్నాయి
అష్ట కష్టంబులకు, కఠిన రోగంబులకు
దివ్యౌషధంబని నమ్మండయ!
ఆత్మజ్ఞాన పద్యాలు
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆత్మజ్ఞానము (ముక్తి మార్గము భక్తి మార్గము పుస్తకములో) నుండి కొన్ని పద్యాలు)
సకల జీవులందు ఆత్మశక్తివై శ్వాసరూపములో హంసగా సంచరిస్తున్న ఓ కాళీ మాతా!
కాలికాంబా యనుట లీలా వినో దంబు
కాదు కాదు! హంస! కాళికాంబె
హంస కాళికాంబె! ఆత్మ కాళిక సుమా
కాళికాంబ! హంస కాళికాంబ!
తా|| కాళికాంబ అనుట వల్ల ఒక ఆనందమైన అనుభూతి కలుగుతుంది సకల జీవులందు శ్వాస రూపములో సంచరిస్తున్న ।హంస। గూడ ఒక ఆనందమైన అనుభూతిని
ఇచ్చేదే. ఆత్మశక్తి హంసరూపములో సంచరిస్తు ఆనందమైన అనుభూతిని కలిగిస్తుంది. ఆనందమైన అనుభూతియే ఆత్మ. ఆత్మశక్తియే కాళీమాతా.
తల్లిదండ్రీ గురువు దైవమ్ములందున
తల్లి పూజ్యముఖ్య మెల్లరకును
సృష్టి కంతటికిని స్త్రీ ప్రధానముగదా
కాళికాంబ! హంస కాళికాంబ
తా|| ఓ కాళీ మాతా! తల్లి తండ్రి, గురువు, దైవము, ఈ నాల్గింటియందు, సమస్త ప్రజలకు మొదటగా పూజింప దగినది తల్లి మాత్రమే. స్త్రీ ముఖ్యముగా సృష్టి అంతటికీ ప్రధానమై యున్నది.
గాలిరీతి విశ్వ గోళాలలో నుందు
దివుల భువుల మధ్య తిరుగగలవు
నీవు లేని చోటు నిక్కమ్ముగా లేదు
కాళికాంబ! హంస కాళికాంబ!
తా|| ఓ కాళి మాతా! గాలి రూపములో, విశ్వగోళాలలో ఉంటావు. భూమి ఆకాశముల మధ్య తిరుగుతుంటావు... నీవులేని చోటు అంటు కచ్చితముగా ఎక్కడలేదు.

No comments:

Post a Comment