Friday, November 11, 2016

మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం

కృష్ణాజిల్లా మోపిదేవి కుమారక్షేత్రం.కుమారక్షేత్రమే సుబ్రహ్మణ్య క్షేత్రం. మోపిదేవి లోని వల్లీ, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానం దక్షిణభారత దేశం లోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం గా విరాజిల్లుతోంది.
స్థల పురాణం:------ స్కాందపురాణం లోని సహ్యాద్రిఖండం లో కృష్ణానదీ మహాత్మ్యము, ఇతర క్షేత్రములను వివరించు సందర్భం లో మోపిదేవి క్షేత్ర ప్రశంస కన్పిస్తోంది.
అగస్త్యమహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరి స్థితుల్లో కాశీని విడిచిపెట్ట వలసి వచ్చింది. వింధ్య పర్వతం అహంకారం తో విజృంభించి, ఆకాశం లోకి చొచ్చుకొని పోయి, సూర్య గమనాన్నిసైతం నిరోధించ సాగింది. ప్రకృతి స్థంభించింది.గ్రహ సంచారాలు నిలిచిపోయాయి. ఈ మహోపద్రవాన్నినివారించ గలిగేది అగస్త్యమహర్షి మాత్రమే నని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్త్యమహర్షి కి , విషయాన్ని వివరించారు.
యోగదృష్టి తో సర్వము నెరింగిన మహర్షి తాను ఇప్పుడు కాశీ ని వీడితే కల్పాంతమైనా తిరిగి కాశీకి రావడానికి వీలు పడదని తెలిసి కూడ లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమర కార్యానికి అంగీకరించాడు . లోపాముద్రా సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి. దారిలో నున్న వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరించింది. తాను మరలి వచ్చే వరకు అలాగే ఉండమని శాసించి ,కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసు లో నిలుపుకొని , దక్షిణాపథం వైపు బయలుదేరాడు అగస్త్యుడు.
పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరం లోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. కనకదుర్గామాతను ,శ్రీకాకుళ ఆంద్ర మహావిష్ణువు ని దర్శించుకొని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు.
“ వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్” అనేమాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది,. ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది. లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయన ననుసరించారు. ఒకపుట్టనుండి దివ్యతేజస్సుని గమనించి. ఇదే “సుబ్రమణ్య క్షేత్రమని ఇది భుక్తి ము క్తి ఫలప్రదమని “శిష్యులకు వివరించాడు అగస్త్యుడు. కుమారమూర్తి కే సుబ్రమణ్య మనెడి పేరని మాండవ్యుడనే శిష్యుని సందేహాన్ని నివృత్తి చేశాడు.
కుమారస్వామి ఉరగ (పాము) రూపం లో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధం గా శిష్యులకు వివరించారు అగస్య్త మహర్షి.
“ సనక,సనకస,సనత్కుమార సనత్సు జాతులనెడి దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల వయసు వారుగానే ఉంటారు, పైగా దిగంబరులు.వారు ఎల్లప్పుడూ భగవదారాధన లోనే కాలం గడుపుతుంటారు.వారు ఒక పర్యాయం పరమేశ్వర దర్శనానికి కైలాసం చేరుకున్నారు. ఆ సమయం లో పరమేశ్వరుడు కైలాసం లో లేడు.లోకమాత పార్వతి,కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు. అదేసమయం లో శచీ,స్వాహా మొదలైన దేవతాస్త్రీలు, లక్ష్మీ సరస్వతులు, పార్వతీ దేవి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు రంగు రంగుల వస్త్రాలు ఆభరణాల తో సుందరీమణులను చూచి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోయాడు.
“ కుమారా! ఏల నవ్వుచున్నావు ?. వారు నేనులా కన్పించలేదా.? ఆ తాపసులు మీ తండ్రి వలే లేరా? భేదమేమైననూ కన్పించినదా ?” యని జగదంబ కుమారుని ప్రశ్నించినది. ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోన పశ్చాత్తాప పడినాడు. తల్లి పాదాలపై బడి క్షమాపణ కోరుకున్నాడు. తల్లి కాదన్న వినకుండా పాప పరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపం తో తపస్సు ప్రారంభించాడు.
ఈ విషయాన్నంతటిని దివ్యదృష్టి తో చూచి శిష్యుల కెరింగించిన అగస్త్యుడు మహాతేజస్సు వచ్చే పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. పడగ వలే ఉండే శివలింగాన్ని దివ్యతేజస్సు వచ్చే పుట్టమీద ప్రతిష్టించాడు.” అత్రస్నానం తు కుర్యాచ్చేత్కోటి జన్మాఘ నాశనమ్, “అని కృష్ణానది లో స్నానం చేసి లోపాముద్ర తో కలసి శిష్యసమేతంగా శివలింగానికి పూజలు నిర్వహించారు అగస్త్యమహర్షి.
కాలాంతరం లో ఆ ప్రదేశమంతా పుట్టల తో నిండిపోయింది. ఆ పుట్టలున్న ప్రాంతానికి సమీపం లోనే కుమ్మరి కులస్తులు కులవృత్తి తో జీవిస్తుండేవారు. వారిలో వీరారపు పర్వతాలు ఒకడు. ఈతను మహాభక్తుడు. అతనికి స్వామి కలలో కన్పించి, తాను ఎక్కడున్నది చెప్పి, లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి , ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు. పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని తనవారందరికి చెప్పి, దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్టించాడు. తనవృత్తిని స్వామి కి అంకితం చేశాడు.మట్టి తో స్వామికి ఇష్టమైన వాటిని తయారు చేసి, వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయం లో భద్రపరచేవాడు. అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మత్తుల సమయం లో శిథిలమై పోగా మిగిలిన నంది ,గుర్రము ఈ నాటికీ స్వామి వారి కళ్యాణమండపం లో భద్రంగా ఉండి , భక్తులకు కనువిందు చేస్తున్నాయి.
ఈ పుణ్యక్షేత్రాన్ని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్లని, కాలక్రమేణా అది మోపిదేవి స్ధిరపడిందని చెపుతారు.
ఆలయప్రత్యేకత.:----- స్వామివారి ఆలయం తూర్పుదిశ గా ఉంటుంది. గర్భగుడి లో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానమట్టం. స్వామి కి వేరే పానమట్టం ఉండదు. పానమట్టం క్రింద అందరికీ కనబడే విధం గా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన ,అభిషేక సమయాల్లో ఆ రంధ్రం లో పాలుపోయడం జరుగు తుంది. ఆలయ ప్రదక్షిణ మార్గం లో ఉన్న పుట్టనుండి గర్భగుడి లోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం.
ఇక్కడ స్వామి వారి ఆలయం లో పుట్టలో పాలుపోయడం విశేష సేవ గా భక్తు లు భావిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలిగించడం, చూపు మందగించినవారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం,మనోవ్యాధి, చర్మసంబంధవ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్ముతున్నారు.
స్వామి వారి ఆలయం లో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం , అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీరమ్రొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమౌతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించు కుంటారు. పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడి ప్రత్యేకతలు.
విశేష పూజలు :------. నాగులచవితి, సుబ్రహ్మణ్య షష్టి వంటి పర్వదినాల తోపాటు ఆదివారం, గురువారం స్వామిని భక్తులు విశేషంగా సందర్శించి, మొక్కులు తీర్చుకుంటారు.
స్వామి వారికి పర్వదినాల్లో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం తో పాటు ప్రత్యేకఅర్చనలు జరుగుతాయి.ఆలయం లో ప్రతి రోజు స్వామి వారికి శాంతి కళ్యాణం జరుగుతుంది.ప్రతి నెలా వచ్చే కృత్తికానక్షత్రం రోజున రాహు, కేతువు ,సర్పదోష నివారణకు ప్రత్యేక పూజలు జరుగుతాయి.ఉగాది ప్రవదినం,దసరా శమీపూజ, కార్తీక దీపోత్సవం, ఆరుద్రో త్సవము విశేషంగా జరుగుతాయి.
మాఘమాసం లో కళ్యాణోత్సవం, రథోత్సవం,వసంతోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.
భక్తుల సౌకర్యార్ధం నిత్యాన్నదాన పథకం ఇటీవలె ప్రారంభించబడింది
రవాణా సౌకర్యాలు . :------- కృష్ణాజిల్లా లో విజయవాడ కు 70 కి. మీ దూరం లోను,మచిలీపట్టణానికి 35 కి.మీ దూరం లోను, గుంటూరు జిల్లా రేపల్లె కు 8 కి. మీ దూరం లోను మోపి దేవి క్షేత్రం ఉంది.అతి సమీపం లోని రైల్వేష్టేషన్ రేపల్లె.
ఇక్కడ ఉండటానికి ఎటువంటి హోటల్ సౌకర్యాలు ఉండవు. గ్రామీణ స్థాయి కాఫీహోటల్స్ మాత్రం ఉంటాయి. అవనిగడ్డ, రేపల్లె, చల్లపల్లి లో ప్రభుత్వ అతిథి గృహాలున్నాయి. 214 ఎ జాతీయ రహదారిపై చల్లపల్లి – పులిగడ్డ మధ్య మోపిదేవి క్షేత్రం ఉంది.


నాగదోషాలకు, సంతాన రాహిత్యా నివారణకు ,జ్ఞానవృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనే తరుణోపాయం గా శాస్త్రాలు చెపుతున్నాయి.

No comments:

Post a Comment