Friday, November 11, 2016

జన్మలు మూడు రకాలు.


1) దేవ జన్మ
2) మానవ జన్మ
౩) జంతు జన్మ.
అన్ని జన్మలలో మానవ జన్మ చాల దుర్లభమైనది మరియు మహోన్నతమైనది అదేలాగు చాల ఉత్తమోత్తమమైనది.
మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి. అందులో అన్ని పుణ్య కర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవ జన్మ నెత్తుతాడు. అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగ భూమి. కనుక అక్కడ అతడికి ఏ కర్మలు చేసే అధికారము లేదు. అందువల్ల పరమాత్మను పొందడానికి తగిన కర్మలాచరించే అవకాశం అక్కడ లేదు.తన కర్మఫలాలననుసరించి భోగాలనుభవించి, ఆ కర్మఫలాలు క్షయం కాగానే “క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి” అన్నట్లు ఈ మర్త్యలోకాన్ని (మనవలోకాన్ని) చేరుకోవలసిందే. మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే.ఈ దేవ జన్మలో కేవలం మనోబుద్దులు ఉంటాయి కాని స్థూల శరీరం వుండదు. కనుక భగవత్సాక్షారానికి ఉపయోగపడే జన్మకాదు ఈ దేవజన్మ.
ఇక అన్ని పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, మొదలైన జంతువులుగా జన్మిస్తాడు.ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడుతాడు. జంతు జన్మలో కర్మలు చేస్తున్నట్లు కన్పించిన, ఆ కర్మలన్ని బుద్దిపరంగా అలోచించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోనేవికావు. కేవలం ప్రకృతి ప్రేరణతోనే పరతంత్రంగా చేస్తాయి.కారణం ఈ జంతు జన్మలలో శరీరం మరియు మనస్సు వున్నాయి కాని బుద్ది మాత్రం లేదు. కనుక ఈ జన్మలలో కూడ కేవలం కర్మఫలాలు అనుభవించుటయే కాని పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. కనుక భాగవత్సాక్షారానికి ఈ జంతు జన్మకూడా ఉపయోగపడదు.
ఇక పుణ్యపాపకర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది. ఈ జన్మలలో పుణ్య కర్మఫలాలు కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు.పాపకర్మ ఫలాల కారణంగా దుఃఖాలు , బాధలు, అవమానాలు అనుభవిస్తాడు.అయితే ఇలా కర్మ ఫలాలనుభవించటం మాత్రమేగాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మనవ జన్మలోనే వున్నది. ఎందుకంటే స్వతంత్రంగా బుద్ది అనే సాదనం వున్న జన్మ ఇది. అదే విధంగా పరమాత్మ నందుకోవదడానికి తగిన కర్మలు చేసే అధికారం , జ్ఞానాన్ని పొందే అవకాశం వున్న ఈ మానవ జన్మ ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది అన్నారు. 84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తరువాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానజన్మను “జంతూనాం నారా జన్మ దుర్లభం” అని శంకరాచార్యులు వారు వివేక చూడామణి గ్రంథంలో తెలియజేయటం జరిగింది. ఇట్టి ఈ అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమమైన మానవజన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్థకం చేసుకోవాలి.
సార్థకం చేసుకోవటమంటే ఏమిటి ? : ఇక్కడ మనం అనుభవించే సుఖాలు (అవి ఏవైనను) తాత్కాలితమైనవే గాని నిత్యమైన సుఖాలు కాదు. ఎన్ని సుఖాలు భోగాలు అనుభవించిన ఇంకా ఎదో వెలితి, ఇంకా ఎదో కావాలనే తపన. ఎందుకంటే అవి నిత్యమైన, పరిపూర్ణమైన సుఖాలు కాదు. ఇవి అనిత్యమైన, పరిమితమైన వస్తువుల ద్వార వచ్చే సుఖాలు. నిత్యమైన, పరిపూర్ణమైన శాశ్వతమైన, సుఖం కావాలంటే నిత్యవస్తువు, పరిపూర్ణ వస్తువు, శాశ్వత వస్తువు ద్వారానే సాద్యం (లభిస్తుంది).ఏమిటా ఆ నిత్య వస్తువు? పరిపూర్ణ వస్తువు? శాశ్వత వస్తువు? ఈ సృష్టికి ములాధారమైన ఏకమైన “పరమాత్మ” మాత్రమే (అయన దివ్య దర్శనాన్ని హృదయాలంలో సాక్షాత్కరించుకోవడమే శాశ్వత సుఖం). “నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం” అని “తత్వబోధ” లో శంకరాచార్యుల వారు స్పష్టం చేసారు.అంటే నిత్యమైన వస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే. దానికి వేరుగా ఉన్న సర్వము అనిత్యమైనవే, అని అర్థం. కనుక నిత్యమైన పరమాత్మతో ఐక్యత వలన లభించే సుఖం, ఆనందం అందుకొనేవరకు మనవుడుకి తృప్తి వుండదు. అసంతృప్తి తీరదు. అట్టి శాశ్వతానందాన్ని అందుకోవటమే, జన్మను సార్థకం చేసుకోవటమంటే. ఆ శాశ్వతనందాన్నే మోక్షం, ముక్తి అన్నారు. అదే విముక్తి (విముక్తి అంటే దేని నుండి విముక్తి? సర్వ బందనాల నుండి విముక్తి). బంధనాలు అంటే కర్మబంధనాలే(కర్మ బంధనాలు అంటే అనంతకోటి జన్మల నుండి మనం చేస్తూ వస్తున్నా కర్మల ఫలాలే ). ఈ బంధనాలున్నంత కాలం మనం ఎదో ఒక జన్మ ఎత్తుతూ వుండాల్సిందే. అలాగాక మళ్ళీ జన్మ లేకుండా ముక్తిని పొంది శాశ్వత ఆనందాన్ని పొందాలంటే ఈ కర్మబంధనాలన్ని వదిలించుకోవలసిందే. వాటిని అన్నిటిని వదిలించుకోవాలంటే భగవంతార్పణ బుద్దితో కర్మలను చెయ్యాలి ఆచరించాలి

No comments:

Post a Comment