Friday, November 11, 2016

పెళ్లినాటి ప్రమాణాలు ...

పెళ్ళినాడు మీరు అన్నిటికి ఒప్పుకొని చేసిన ప్రమాణాలను ఎలా మరుస్తారు ??
'ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ నాతి చరామి' అని వరుడు ప్రమాణం చేస్తాడు. అంటే 'ధర్మమునందు గాని, సంపదల విషయములందు గాని, శారీరక సుఖ విషయములందు గాని, దాన ధర్మములవల్ల లభించు మోక్ష విషయములందు గాని నిన్ను విడిచి నడువను.' అని వధువును పరిగ్రహించే ముందు వరునిచేత ప్రమాణం చేయిస్తారు. తరువాత మాంగళ్యధారణ సమయం లో కూడ ప్రమాణం లాంటి మంత్రాన్నే ఈ విధం గా చెబుతాడు వరుడు.
'మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా.
కంఠే భద్నామి శుభగే త్వం జీవ శరదశ్శతం '
అనగా : ఓ మాంగళ్యమా! నా జీవనానికి కారణ భూతురాలైన ఈ సౌభాగ్యవతి కంఠానికి నిన్ను అలంకరిస్తున్నాను. నీవు నూరు సంవత్సరాలు ఈమె కంఠము నందే వుందువు గాక!. ' అని చెప్పి మాంగళ్యాన్ని వధువు మెడలో మూడు ముళ్ళు వేసి కడతాడు.... త్రిమాతలైన లక్ష్మీ, పార్వతి, సరస్వతి దేవి లకు అంకితం గా మూడు ముళ్ళుగా వాటి యొక్క పవిత్ర చిహ్నంగా అవి పేర్కొనబడతాయి ...
సప్తపది లో కూడా ... ' ఏకం ఇషే విష్ణుత్వాం అన్వేతు' అనే మంత్రాలతో ఏడడుగులు వేయిస్తారు....
మొదటి అడుగు శక్తి కోసం, రెండవ అడుగు బలం కోసం, మూడవ అడుగు వ్రతం కోసం, నాల్గవ అడుగు ఆనందం కోసం, ఐదవ అడుగు ఇంద్రియ బలం కోసం, ఆరవ అడుగు రుతువుల కోసం, ఏడవ అడుగు గృహ ధర్మాల కోసం.. ఇద్దరమూ జీవితాంతం ఇలాగే కలసి నడుస్తాము అని అగ్ని సాక్షి గా ప్రమాణం చేస్తూ నడుస్తారు. ఈ సప్తపది తో వధువు యింటి పేరు మారిపోతుంది. వివాహానికి ఈ కార్యక్రమమే చాలా ముఖ్యమైనది.... పెళ్లి నాటి ప్రమాణాలు అంటే ఇవి... వీటిని పురుషుడు తప్పనిసరిగా అనుసరించి ఆచరించిన నాడే.. పవిత్రమైన వివాహం పరమార్ధ స్థితిని చేరుకుంటుంది. భర్తకు భార్య.... భార్య కు భర్త ..... అన్యోన్యంగా తోడు, నీడగా .. అరమరికలు లేకుండా అర్ధ నారీశ్వర తత్వం తో బ్రతికినప్పుడే ఈ ప్రమాణాలకు అర్ధం, విలువ వుంటుంది.
కీచులాటలతో, వివాదాలతో, నిత్య సమస్యలతో... నిండు జీవితాలను బండల పాలు చేసుకోకూడదు. ప్రతి ఒక్కరు వివాహ ప్రయోజనాలను అర్ధం చేసుకోవాలి, వాటి గురించి తెలుసుకోవాలి....
ఇదీ మన హిందూ ధర్మం లో వివాహం యొక్క గొప్పదనం

No comments:

Post a Comment